ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు స్పిల్వే డిజైన్లపై ఆదివారం డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ (డీడీఆర్సీ) సమీక్షించనుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద జరిగే ఈ సమీక్షలో ప్రాజెక్టు అథారిటీ సీఈవో ప్రధాన్, పీపీఏ సీఈ జైన్ కేఆర్ఎంబీ చైర్మన్ గుప్త, ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.
ప్రధానంగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్వేకు కుడి ఎడమలలో బండ్ల నిర్మాణంపై సమీక్షిస్తారు. కుడివైపు బండ్ నిర్మాణంపై ఎలాంటి అభ్యంతరాలూ లేనప్పటికీ, ఎడమవైపు బండ్ల ఏర్పాటుపై కేంద్ర జల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రత్యామ్నాయ డిజైన్లను అందించాలని ప్రధాన నిర్మాణ సంస్థ నవయుగకు సూచించింది. గోదావరి జలాలను విడుదల చేయడం ద్వారా కాఫర్ డ్యామ్ పనులు నిలిపివేయడంపైనా చర్చించే అవకాశం ఉంది.