విజయవాడలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశం ముగిసింది. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో రాజేంద్రకుమార్ జైన్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో మూడేళ్లు పడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాఫర్ డ్యాం రక్షణ పనులు, వరద అంచనా వ్యవస్థలపై చర్చించామని వెల్లడించారు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ పని పాక్షికంగా పూర్తయిందనీ, వరదలు రాకముందే పనులను వేగవంతం చేయాలన్నారు.
ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల వరదను అంచనా వేస్తున్నామని చెప్పారు. దీని వల్ల కాఫర్ డ్యాంకు ఇబ్బంది లేదన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి రూ. 6,700 కోట్లు విడుదల అయిందని, బిల్లుల్లో కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. రేపు పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ సభ్యులు పరిశీలిస్తారని తెలిపారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచడంపై.. కేంద్రం పరిధిలోని ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని రాజేంద్రకుమార్ జైన్ పేర్కొన్నారు.