తెలంగాణ శాసనసభ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని సిరిసిల్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శ్రీనివాస్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం పై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ ఆయనకు స్వయంగా లక్ష్మీపుత్రుడిగా నామకరణం చేశారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో రెండో హరిత విప్లవానికి కూడా బీజం పడిందన్నారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. 4,200 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను పోచారం సారథ్యంలో నియమించారు. వ్యవసాయంలో పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా కొత్త పుంతలు తొక్కించా రని కేటీఆర్ ప్రశంసించారు. రూ.17 వేల కోట్ల రైతురుణమాఫీ, 58 లక్షల మంది రైతులకు రైతుబంధు, 38 లక్షల మంది రైతులకు రైతుబీమా ద్వారా భరోసా కల్పించిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డిదే అని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం
తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్గా పోచారం శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఈటల రాజేందర్, అహ్మద్ బలాలా తదితరులు పోచారంను స్పీకర్ కుర్చీ వరకు తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ నుంచి పోచారం బాధ్యతలు స్వీకరించారు.
పోచారం శ్రీనివాస్ను అన్ని పార్టీల సభ్యుల ఎన్నుకోవడంతో స్పీకర్ పోచారంకు సీఎం కేసీఆర్, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. గురువారం మధ్యాహ్నం శాసనసభలో పోచారం నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు నిర్ణీత గడువులోగా ఆయన ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.