ప్రధాని నరేంద్రమోదీ భారతదేశ విజయం కోసం శాస్త్రవేత్తలంతా తీవ్రంగా ప్రయత్నించారని కొనియాడారు. భరతమాత తలెత్తుకునేలా జీవితాన్ని ధారపోశారని అన్నారు. చంద్రయాన్-ప్రయోగం అనంతరం బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భరతమాత కలలను సాకారం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నించారని, ఏం జరిగింది? ఎలా జరిగిందన్నది శాస్త్రవేత్తల మెదళ్ల నుంచి తొలగించాలని మోదీ అన్నారు. ” మీ బాధను నేనూ పంచుకుంటున్నాను.
దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించదగింది. మన విజయాలకు మరిన్ని భారీ కొలమానాలు పెట్టుకోవాలి.ప్రతి సందర్భంలోనూ మన సత్తా చాటుదాం. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు మనల్ని మరింత ధృఢంంగా తీర్చిదిద్దుతాయి. సాధించిన ఫలితాలతోపాటు సాగించిన కృషి కూడా గుర్తించాలి. చంద్రయాన్ 2 విషయంలో గొప్ప ప్రయత్నాలు శాస్త్రవేత్తలు చేశారని గర్వంగా చెబుతాను” అని ప్రధాని మోదీ అన్నారు.