విదేశీ పర్యటనలో భాగంగా శ్రీలంకకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ కి కొలంబో ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని రణీల్ విక్రమసింఘే స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. ఇటీవల పేలుళ్లు జరిగిన కొలంబో సెయింట్ ఆంటోని చర్చిని భారత ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. పేలుళ్ల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
లంకేయుల స్ఫూర్తిని టెర్రరిస్టుల క్రూరత్వం దెబ్బతీయలేదని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. శ్రీలంకకు మద్దతుగా భారత్ నిలుస్తుందన్నారు. శ్రీలంకలో తనకు ఇది మూడో పర్యటన అని, చాలా సంతోషంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. మోదీ తన పర్యటనలో లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే, తమిళ నేషనల్ అలయన్స్ నేతలతో భేటీ కానున్నారు.