రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని మోదీ ఈరోజు కేదార్నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఇవాళ కేదార్నాథ్లోనే మోదీ బస చేయనున్నారు. కేదార్ నాథ్ లో ఉన్న పవిత్ర ధ్యాన గుహలో ఆయన ధ్యానం చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం వరకు ఈ ధ్యానం కొనసాగనుంది. ఈ గుహకు చేరుకోవడానికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఆయన కొండపైకి ఎక్కారు.
మరోవైపు, మీడియా విన్నపం మేరకు ప్రారంభంలో కొన్ని ఫొటోలు తీసుకోవడానికి అనుమతించారు. ఆ తర్వాత మీడియాను గుహ వద్దకు అనుమతించలేదు. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ రేపు జరగనున్న తరుణంలో కేదారీశ్వరుడిని మోదీ దర్శించుకోవడం గమనార్హం. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా రేపే పోలింగ్ జరగబోతోంది. సుమారు 20 గంటల పాటు ధ్యాన గుహలోనే మోదీ ఉంటారని ప్రాథమిక సమాచారం. ఇవాళ సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలోనూ మోదీ పాల్గోనున్నారు.