జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని హైదరాబాదులో అరెస్ట్ చేసి అనంతపురం తరలించడం తెలిసిందే. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అరెస్టుల పేరుతో టీడీపీ నేతలను భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు వచ్చినా, ఇతర టీడీపీ సీనియర్లు వచ్చినా జగన్ ప్రభుత్వం మీడియా సమక్షంలో అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కక్కుర్తి సొమ్ము కోసం ఎంత నీచానికైనా దిగజారే మాజీ శాసనసభ్యుడు, అతని కుటుంబ సభ్యుల అక్రమాల గురించి జగన్ సర్కారు ఆధారాలతో సహా వివరించాలని నిర్ణయించుకుందని తెలిపారు.”బీఎస్3 ప్రమాణాలతో వాహనాలను 2017 మార్చి 31 తర్వాత ఏ కంపెనీ తయారు చేయకూడదు, షోరూంలలో అమ్మకూడదు, ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, అశోక్ లేలాండ్ కంపెనీ వద్ద ఇలా మిగిలిపోయిన 154 బీఎస్3 లారీ చాసిస్ లను జేసీ కుటుంబసభ్యులు జటాధరా ఇండస్ట్రీస్, మెస్సర్స్ సి.గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ పేరిట కొనుగోలు చేశారని వెల్లడించారు.
ఈ రెండు కంపెనీల ద్వారా 66 బీఎస్3 లారీ చాసిస్ లు 2018లో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ అయినట్టు మాకు సమాచారం అందింది. ఈ చాసిస్ నెంబర్లు అశోక్ లేలాండ్ కంపెనీకి పంపిస్తే, ఆ 66 చాసిస్ లలో 40 చాసిస్ లను గోపాల్ రెడ్డి కంపెనీకి, 26 చాసిస్ లను జటాధరా ఇండస్ట్రీస్ కు తుక్కు ఇనుము కింద అమ్మినట్టు రిప్లయ్ ఇచ్చారు. ఈ వాహనాలన్నీ నాగాలాండ్ లోని కోహిమాలో రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిసింది. దాంతో మేం అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి : మంత్రి ప్రత్తిపాటి