టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ వివేక్ పెద్దపల్లి లోక్సభ నుంచి బీజేపీ నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోటీకి దూరంగా ఉండాలని వివేక్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన ద్రోహం వల్లే నాకు టికెట్ రాలేదన్నారు. స్వతంత్ర అభ్యర్తిగా బరిలోకి దిగితే కొత్త గుర్తుపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉంటుంది. కాబట్టే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నాని వెల్లడించారు.
మరోవైపు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎస్.కుమార్ను బీజేపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసినా ఆయనకు బీ–ఫారం ఇవ్వలేదు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులకు బీ–ఫారాలను అందజేసింది. మాజీ ఎంపీ వివేక్ను పెద్దపల్లి నుంచి పోటీలో నిలపాలన్న ఆలోచనతోనే ఎస్.కుమార్కు బీ–ఫారం నిలిపేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ టికెట్ ఆఫర్ చేసినా వివేక్ ఆసక్తి చూపలేదు.