తెలంగాణలో మానవ హక్కులనూ ఉల్లంఘిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించిన తీరు దారుణమన్నారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేడ్కర్ను టీఆర్ఎస్ అవమానించిన తీరును రాష్ట్ర ప్రజలు గమనించాలని అన్నారు. ఈ విషయం పై నిరసన తెలిపేందుకు సిద్ధమైన మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేయడం పై మండిపడ్డారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు కూడా సీఎం కేసీఆర్ రాకపోవడం దారుణమన్నారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని ముక్కలుగా చేసి డంపింగ్ యార్డుకు తరలించడం లాంటి అమానవీయ, అప్రజాస్వామిక ఘటనలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తుందన్నారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతామని, ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఉత్తమ్ హెచ్చరించారు. రాజకీయ కక్షలకు పరాకాష్టగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసులు.. ఇదేమని అడిగినందుకు ఆయనపైనే అక్రమంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.