కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది సాహసోపేతమైన రీతిలో సేవలందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బందిపై అభినందనలు వెల్లువిరుస్తున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ వైద్య, ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక సందేశం వెలువరించారు.
తమ ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని తెలిసినా, విధి నిర్వహణలో వెనుకంజ వేయకుండా కరోనా రోగుల చికిత్సలో పాలుపంచుకుంటున్నారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సమాజం సాకారమవుతుందని, ఆ దిశగా ఆరోగ్యవంతమైన సమాజం స్థాపించేందుకు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. తమ కుటుంబాలకు ముప్పు ఉంటుందని తెలిసినా వృత్తి ధర్మాన్ని విస్మరించకుండా ముందుకు సాగుతున్నవారి సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.