సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సైరా” టీజర్ ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్ త్రివేది. ఈ చిత్రంలో అమితాబ్ రాజగురువు పాత్రలో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం అమితాబ్ టీంతో కలిసి షూటింగ్లో పాల్గొన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సైరా సెట్కి వెళ్ళారు. తన అభిమాన నటుడు.. అన్నయ్య సినిమాలో నటిస్తున్నారని తెలిసి, బిగ్ బీని కలిసేందుకు అక్కడికి వెళ్లారు పవన్. కొద్ది సేపు అమితాబ్ తో ముచ్చటించిన తర్వాత చిరు, అమితాబ్, చెర్రీ, పవన్ కళ్యాణ్ కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటో అప్పట్లో వైరల్ కాగా, పవన్ తాజాగా మరోసారి ఆ ఫోటోలని తన సోషల్ మీడియా పేజ్ ద్వారా షేర్ చేశాడు. “నా జీవితంలో ఆ క్షణం ఎంతో అపురూపం. నా గురువు, గౌరవప్రదమైన ‘శ్రీ అమితాబ్ బచ్చన్ జీ’ ను ‘సైరా’ సెట్స్లో కలిసాను. అతని జీవితం మనకు ఎన్నో బోధిస్తుంది. జీవితంలో ఎదుగుతున్న క్రమంలో ఎదురయ్యే అసమానతలని ఎలా పోరాడాలి అనేది ఆయన జీవితం నేర్పిస్తుంది” అని పవన్ పేర్కొన్నారు.
previous post