తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్రెడ్డి దర్శకుడు. అమిత్ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పలు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సైరా సినిమా గురించి మాట్లాడటంతో పాటు చిరంజీవి గొప్పతనం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పడిపోవాలని చాలామంది కోరుకున్నారని, కానీ ఆయన మాత్రం అందరూ బాగుండాలనే కోరుకున్న వ్యక్తి అని, చిరంజీవి కారణంగానే తాను ఇంకా బతికి ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ స్టేజ్పైనే కొందరిపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఇంత గొప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అందరూ రావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనే దానిపై సినీ సర్కిల్స్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారేమో అనే గుసగుసలు కూడా మొదలయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలను రామ్ చరణ్ ఆహ్వానించారని సమాచారం. వాళ్లెవరూ రాకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది.
previous post
next post