telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ వార్నింగ్!

తాజాగా శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తనను దూషిస్తున్న కొంతమంది రాజకీయనాయకులకు గట్టివార్నింగ్ ఇచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్‌ను అతని తల్లిని తీవ్ర స్థాయిలో దూషించిన సినీ నటి శ్రీరెడ్డి పేరు ప్రస్తావించకుండానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇటీవల కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ బండబూతులు తిట్టిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో ద్వారంపూడి వర్గీయులకు జనసైనికులకు మధ్య కొట్లాటలు జరిగాయి. పలువురు జనసైనికులపై కేసులు నమోదు చేశారు కూడా. ఈ ఇష్యూలో సైతం ద్వారంపూడికి సపోర్ట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్‌ను బండ బూతులు తిట్టింది శ్రీరెడ్డి. తనను దూషిస్తున్న వారిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. శ్రీరెడ్డి పేరును ప్రస్తావించకుండానే గట్టివార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను యువతకి సంబంధించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. సమాజానికి ఉపయోగపడే ప్రజల్ని ఉత్తేజపరిచే ఉపన్యాసాలు చేసే ఒక యోగి ఉన్నారు.. ఆయన ఒక ఊరికి వెళ్లగా ఒక చెరువును దాటి జనం వెళ్తూ ఉన్నారు.. అక్కడ ఆగుదాం అంటే.. అవసరం లేదు.. ఇక్కడ జనానికి మనం చెప్పాల్సింది లేదు అన్నారట ఆ యోగి. చాలా మంది ఉన్నారు కదా అంటే.. యువకులు ఉన్నారు కాని.. చెరువు మొత్తం పాచిపట్టిపోయి ఉంది. యువత ఉండి చెరువు పాచిపట్టి ఉంది అంటే.. యువత ఇక్కడ పనిలేకుండా ఉన్నారని అర్థం. ఇలాంటి వాళ్లు ఉన్న చోట మనం ఉండాల్సిన పనిలేదు.. మనం పోదాం పద అన్నారట ఆ యోగి.

ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను రాజకీయాల్లోకి నా స్వార్థం కోసం రాలేదు. ఇంత మంది చేత నేను మాటలు అనిపించుకోవల్సిన అవసరం లేదు. మొన్న కాకినాడలో ఎవరో ఒక నాయకుడు తిట్టినట్టుగా అలాంటి మాటలు తిట్టించుకోక్కర్లేదు. వ్యక్తిగతంగా నన్ను అలాంటి మాటలు నన్ను అంటుంటే.. పూర్తిగా నేను యాక్టర్ అయ్యింటే.. గతంలో నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసేవాడినో అలా చేసేవాడిని. తిట్టకూడని పదంతో నా తల్లిని తిట్టారు. ఇవన్నీ ఎందుకు పడ్డాను? ఉప్పు, కారం తింటున్నవాడిని కోపం ఉండదా నాకు. పౌరుషం లేదా నాకు? కడుపు మండదా? ఈ మాటలన్నీ ఎందుకు భరిస్తున్నా అంటే.. నా కోపాన్ని దాటాను కాబట్టే నేను పొలిటికల్ పార్టీని పెట్టా. రేపటి రోజున నేను పార్టీ పెట్టకుండా ఉండి ఉంటే.. సుగాలి ప్రీతి తల్లి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నిస్సహాయంగా ఉండిపోయే వాడిని. అవునమ్మా లోకం చెడ్డది తల్లీ అని నేను కూడా ఇంట్లో తలదించుకుని ఇంట్లో ఒక్కడ్నే కూర్చుని చెప్పుతో కొట్టుకునే వాడిని. కాని ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉంది. ఓడిపోయినప్పటికీ చాలా ఆనందంగానే ఉంది. ఎందుకంటే న్యాయం కోసం నిలబడ్డాం. సాయం చేయమన్న వాళ్ల కోసం పోరాటం చేశాం. అది ఉద్ధానం దగ్గర నుండి సుగాలి ప్రీతి వరకూ.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేయగలిగాం. ఇందులో ఏ స్వార్థం లేదు. మరి ఏం ఉంది అంటే.. సమాజం బాగుండాలి అనే ఆకాంక్ష మాత్రమే అంటూ ఉపన్యసించారు.

Related posts