గోదావరి నదిపై 160 ఏళ్ల కిందట సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్ట వల్లే డెల్టా నేటికి పచ్చగా కళకళలాడుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. కాటన్ జయంతి సందర్భంగా తన తరపున, జనసైనికుల తరపున మన:పూర్వక అంజలి ఘటిస్తున్నానని అన్నారు. గోదావరి పుణ్య స్నానం ఆచరించేటప్పుడు కాటన్ ను స్మరిస్తూ నేటికి అర్ఘ్యం సమర్పిస్తున్నారంటే ప్రజలు ఆయనకు అర్పించే కృతజ్ఞతాపూర్వక నివాళి అది అని కొనియాడారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని కాపాడటంతోపాటు తాగు నీటిని అందించాలంటే కావాల్సింది ప్రజల పట్ల బాధ్యత అని కాటన్ జీవితాన్ని చదివితే అర్థమవుతుందని అన్నారు. కేవలం, గోదావరి ప్రాంతంలోనే కాకుండా కృష్ణా తీరం, తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరని అన్నారు.