ఆంధ్రప్రదేశ్ లో పోరాటాలను తట్టుకునే నేతలు ప్రస్తుతం కనుమరుగైపోయారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప జిల్లా నేతలతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన కోసం పోరాటం జరుగుతుంటే ఆ పోరాట ఒత్తిడిని తట్టుకునే నాయకుడు మన రాష్ట్రంలో లేకుండా పోయారన్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లాంటి నాయకులు ఎలాంటి ఒత్తిడిని అయినా తట్టుకునేవారన్నారు.ఇందిరా గాంధీపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన సిద్ధాంతానికి అనుగుణంగా రాష్ట్రాన్ని విభజించేందుకు ముందుకు రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి నేతలు మనుకు ఇప్పుడు కనుమరుగైపోయారన్నారు. ఆమెకు ఉన్న రాజకీయ సంకల్పం బలం అలాంటింది అంటూ పవన్ కొనియాడారు .
90వ దశకం చివరిలోనే తెలంగాణ భావజాలం బలపడడాన్ని తాను గమనించినట్లు తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో ఎలాంటి భావజాలం వచ్చిందో ప్రస్తుతం రాయలసీమలో కూడా అలాంటి పరిస్థితే నెలకొందన్నారు. ఈ అంశంపై ఆలోచించకపోతే భవిష్యత్ లో ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని పవన్ పేర్కొన్నారు.