జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక, పూర్తిగా ప్రజాసేవకే అంకితమని స్పష్టం చేశారు. అయినా ఆయన మళ్ళీ సినిమాలలో నటిస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై మరోసారి గట్టిగ స్పందించింది జనసేన పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రానున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. అయితే పవన్ మాత్రం తన సినీ జీవితం అక్కడితోనే అయిపోయిందని మళ్ళీ సినిమాలు చేసే ఆలోచనలు లేవని, పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే ఉంటానని చెప్పారు. అయినా కూడా పుకార్లు ఆగట్లేదు. పవన్ కళ్యాణ్ మళ్ళీ వస్తున్నాడంటూ, దర్శకులు కథలు సిద్ధం చేసుకోండంటూ వార్తలు వస్తున్నాయి.కొన్ని సార్లు అదంతా ఇజమేనేమో అని అనిపిస్తుంది. ఈ ప్రచారం చేస్తుంది ఎవరో తెలియదు కానీ పవన్ మళ్ళి సినిమాల్లో కనిపించాలని ఆయన అభిమానులు విపరీతంగా కోరుకుంటున్నారు. అభిమాన హీరోని మళ్ళీ ఒక్కసారి మంచి మాస్ మసాలా సినిమాలో చూడాలని అందరూ అనుకుంటున్నారు.
పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆ రూమర్లు మరోసారి ఊపండుకున్నాయి. పవన్ సినిమాను డైరెక్ట్ చేయబోయే దర్శకుడంటూ పలువురి పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.దీంతో అభిమానుల్లో మరోసారి జనసేనానిని వెండితెరపై చూడొచ్చనే ఆశలు చిగురించాయి. కానీ అవేవీ నిజం కాదని తేలిపోయింది. ఈ విషయం మీద నేరుగా జనసేన పార్టీ అధికారిక విభాగం క్లారిటీ ఇచ్చింది. పవన్ పదవిని వదులుకుని సినిమాల్లోకి వస్తారని కొందరు తప్పుడు లేఖను సృష్టించారని, ఈ తప్పుడు వార్తలను సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పార్టీ లీగల్ విభాగం చర్యలు ప్రారంభించిందని , పవన్ ఎప్పటికీ ప్రజాక్షేత్రంలోనే ఉంటారని వివరణ ఇచ్చింది. దీంతో నిన్నటి నుండి ప్రచారంలో ఉన్న తప్పుడు వార్తలకు చెక్ పడింది. అయినా మళ్ళీ ఏదో ఒకరోజు పుకార్లు లేచే అవకాశం లేకపోలేదు.