పార్టీలకు అతీతంగా ఇసుక సమస్య పరిష్కారానికి అందరు ఐక్యంగా పోరాడాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోరారు. నవంబర్ 3న జనసేన విశాఖపట్నంలో తలపెట్టిన లాంగ్ మార్చ్లో తమతో కలిసి పాల్గొనాలని రాష్ట్రంలోని రాజకీయ పక్షాల అగ్రనేతలను ఫోన్లో కోరినట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఆర్టిసి సమ్మె కోసం అక్కడి రాజకీయ పక్షాలు ఎటువంటి స్ఫూర్తి చూపుతున్నాయో, ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్లీ ఉపాధి లభించేలా అన్ని రాజకీయపక్షాలూ ముందుకు రావాలని కోరారు.
ఈ సమస్యపై బిజెపి ఎపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇదే విషయమై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎపిసిసి ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, లోక్సత్తా అధ్యక్షులు డివివిఎస్ వర్మ, బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు సంపత్రావులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తమ తమ పార్టీల్లో చర్చిస్తామని వారు చెప్పినట్లు తెలిపారు.