జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. నిజానికి రెండు స్థానాలలో పవన్ పోటీకి దిగుతున్నారు. పవన్ ఏపీలో తనకు అనుకూలమైన ఓటు రాబట్టేందుకు తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ నాయకులు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నా హైదరాబాద్లో ఉన్న మన ఎమ్మెల్యేలకు మాట్లాడడానికి ధైర్యం లేకుండా పోయిందన్నారు. ఓసారి తాను తెలంగాణలో సభ పెడితే తనను కొట్టేందుకు ఏకంగా వందమంది వచ్చారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందమంది తన సభలో దూరిపోయి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు.
పవన్, తాము సత్యమే మాట్లాడతామని, తప్పుంటే సరిదిద్దుకుంటామని, అలాగే తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని, తోలుతీస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో తమ గొంతులు నొక్కే హక్కు ఎవరికీ లేదన్నారు. అది హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా ఎక్కడైనా అంతేనన్నారు. తాను భారతీయుడినని, ఎక్కడైనా మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని పవన్ స్పష్టం చేశారు. తనను కొట్టేందుకు ఎన్ని లక్షల మంది వచ్చినా భయపడనని పేర్కొన్న పవన్.. ఆ రోజు తనను కొట్టడానికి వచ్చిన వంద మంది ఆ తర్వాత చప్పట్లు కొట్టి వెళ్లిపోయారని పవన్ పేర్కొన్నారు.
ఇలా పవన్ ఏపీలో తెలంగాణపై విరుచుకుపడుతుంటే.. ఆ రాష్ట్రంలో జనసేన నేతలు ప్రచారానికి వెళ్ళడానికే భయపడుతున్నారు. ఒకపక్క తమ నాయకుడు తెలంగాణ ప్రజలను తిడుతుంటే, మరోపక్క తమను గెలిపించండి అంటూ ఏ ముఖం పెట్టుకు అడగాలో అంటూ వారు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇక జనసైనికులు కూడా ఈ తిట్టే ప్రచార పద్దతి మార్చుకోవాలని తమ నేతకు విజ్ఞప్తి చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఒక పక్క తెలుగు వారు అందరూ కలిసి ఉండాలి అంటూనే, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక చోట మరొకరిని తిట్టుకోవడంతోనే వారి పనితనం ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రేయ్ రామ్ గోపాల్ వర్మ… సిగ్గులేనోడా… వర్మపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు