తాజా తానా సభల ముసుగులో తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలు మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ నేత రామ్ మాధవ్ తానా వేడుకల సందర్భంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం రామ్ మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో పనిచేసే ఉద్దేశం లేదని, అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ ను స్నేహపూర్వకంగానే కలిశానని, తమ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయశక్తిగా ఎదగడమే ప్రస్తుతం బీజేపీ ముందున్న లక్ష్యం అని వెల్లడించారు.
ఈ విషయంపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. పాత పరిచయంతోనే రామ్ మాధవ్ ను కలిశానని వెల్లడించారు. తాను రామ్ మాధవ్ ను కలవడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని స్పష్టం చేశారు. బీజేపీతో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బీజేపీని ప్రశ్నించానని తెలిపారు. కాగా, ఇరువురు నేతల మధ్య నెలరోజుల జగన్ పాలన ప్రముఖంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ పాలన తీరుపై అభిప్రాయాలు పంచుకున్నట్టు సమాచారం.
ఈ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది: నారా భువనేశ్వరి