గుంటూరు-దొనకొండ సెక్షన్లో రైలు పట్టాల నిర్మాణం నిమిత్తం ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తారీఖు వరకు ఆరు రోజుల పాటు ఈ రూట్లో తిరిగే పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఉదయం 5.30 గంటల పాటు ట్రాఫిక్ బ్లాక్ అమలులో ఉంటుందన్నారు. ఈ కారణంగా నంబర్ 57328 గుంటూరు – డోన్ ప్యానింజర్ని ఆరు రోజుల పాటు రద్దు చేస్తున్నామన్నారు.
కొన్ని రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రద్దయిన రైళ్లు: గుంటూరు – డోన్ ప్యాసింజర్(నంబర్ 57328)ను16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, డోన్ – గుంటూరు ప్యాసింజర్(నంబర్ 57327) ను ఈనెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే రేపల్లె – మార్కాపురం రోడ్డు ప్యాసింజర్ (నంబర్ 77247) ఈనెల 17, 21 తేదీల్లో గుంటూరు వరకే నడుస్తుంది. మార్కాపురం రోడ్డు – తెనాలి ప్యాసింజర్ (నంబర్ 77249) ఈనెల 17, 21 తేదీల్లో గుంటూరు నుంచి నడుస్తుంది. హుబ్లీ – విజయవాడ ప్యాసింజర్ (నంబర్ 56502) ఈ నెల 17న 15 నిమిషాలు, 21వ తేదీన 45 నిమిషాల పాటు మార్గమధ్యంలో నిలిపివేస్తారు.