వాట్సాప్ విషయంలో గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ తెచ్చే కొత్త పాలసీ కారణంగా మన విషయాలు బయటికి తెలుస్తాయి అని చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. గోప్యత విధానాల పాలసీకి అంగీకరించకుంటే ఖాతాలను తొలగిస్తామని, తప్పనిసరిగా గోప్యతా పాలసీ విధానాన్ని అంగీకరించాలని వార్తలు వస్తున్న నేపథ్యంలో అనేకమంది భయపడి వాట్సాప్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్, ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్లకు నోటీసులు జారీ చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ, సోషల్ మీడియాల దుర్వినియోగం, డిజిటర్ మాధ్యమాల్లో మహిళల భద్రత లాంటి అంశాలపై చర్చించేందుకు జనవరి 21 తేదీన సమావేశం కావాలని అందులో ఆదేశించింది. వాట్సాప్ కొత్త పాలసీపై వివాదం నేపథ్యంలో పార్లమెంట్ సమాచార, సాంకేతిక స్టాండింగ్ కమిటీ ఆదివారం సమావేశమయింది. ఇందులో భాగంగా సోషల్ మీడియాల్లో వ్యక్తిగత సమాచార గోప్యతపై వస్తున్న ఆరోపణలకు ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతినిధులు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలు తెలపాలని పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాకేంతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధుల సాక్ష్యాధారాలపై తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
previous post