కాలం చెల్లిన రైళ్లతోనే రైల్వే శాఖ నెట్టుకొస్తున్నట్టుగా ఉంది, అందుకే ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డుపై కాలం చెల్లిన బస్సులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే, పట్టాలపై నడిచే అదే తరహా రైళ్లు కూడా ఎప్పుడైనా ప్రమాదానికి గురయ్యేంత పాతవే వాడుతుండటం గమనార్హం. తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. యశ్వంత్పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులోని ప్యాంట్రీ కారులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు బోగీ మొత్తం వ్యాపించాయి. రాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి రైలు నుంచి బయటపడ్డారు.
ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది రైలు నుంచి ఆ బోగీని వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా విశాఖపట్టణం-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.