పాక్ దుర్మార్గపు ఆటలకు అడ్డుకట్ట వేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రస్తుతం సింగపూర్ లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉన్న ఆయన, ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇండియాలో ఓ పూర్తి స్థాయి రాష్ట్రం ఇతర ప్రాంతాలతో ఏకీకృతం కాలేదని, అది దురదృష్టకరమని కాశ్మీర్ ను ఉద్దేశించి ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ, నిర్దిష్ట పరిస్థితుల కారణంగానే అప్పట్లో ఈ అధికరణను తెచ్చారని తెలిపారు.
బీజేపీ ఏర్పడినప్పడి నుంచి ప్రతిసారి ఎన్నికల మేనిఫెస్టోల్లో దీన్ని రద్దు చేస్తామని తాము హామీ ఇస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. కశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసి తీరుతామని తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్ తో దౌత్య సంబంధాలకు పాక్ గండికొడుతూ వస్తోందని అన్నారు. ఇండియన్ సినిమాలను పాక్ థియేటర్లలో ప్రదర్శించడం లేదని, థార్, సంజౌతా ఎక్స్ ప్రెస్ లను నిలిపివేశారని రాజ్ నాథ్ ఆరోపించారు.