భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో మొన్నటివరకు యుద్ధం గురించి మాట్లాడిన పాకిస్తాన్ ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చింది. ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ శాంతి గురించి మాట్లాడుతోంది. భారత్ ను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలని భావించిన పాక్ కు చైనా సహా ఏ ఒక్క దేశమూ పూర్తిస్థాయి భరోసా ఇవ్వకపోవడంతో పాక్ యుద్ధోన్మాదంతో రంకెలేసింది. అయితే ఆ ఆవేశం మూణ్నాళ్ల ముచ్చటే అయింది.
పాక్ అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నా సరే ఏ ఒక్క దేశమూ స్పందించకపోగా, భారత్ కూడా పాక్ కు అంత సీన్ లేదు అని బాహాటంగా ప్రకటించింది. దాంతో ఏమీ పాలుపోని దాయాది దేశం ఇప్పుడు కొత్తగా చర్చల బాణీ ఎత్తుకుంది. భారత్ తో షరతులతో కూడిన ద్వైపాక్షిక చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెబుతున్నారు.