భారతదేశ ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం మరియు 370 అధికరణాన్ని నిర్వీర్యం చేయడం పై పాక్ అవాకులు చెవాకులు పలుకుతుంది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాంతాలుగా విభజించేందుకు భారత్ పూనుకోవడంతో ఈ ప్రాంతంలో భద్రతాపరమైన పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కశ్మీరీలకు సాయం చేయడానికి ‘ఎంతకైనా తెగిస్తామ’ని పాక్ సైన్యాధిపతి జనరల్ క్వామర్ జావెద్ బజ్వా స్పష్టంచేశారు. భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఎలాంటి దుష్టపన్నాగాన్నైనా తిప్పికొట్టడానికి సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. కశ్మీర్లోని పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యంలో అత్యున్నత నిర్ణాయక వేదిక అయిన కోర్ కమాండర్ల సదస్సును బజ్వా నిర్వహించారు. ఇందులో పూర్తిగా కశ్మీర్ అంశంపైనే చర్చించారు. ”కశ్మీరీలు, వారు సాగిస్తున్న ఉద్యమానికి పాక్ సైన్యం పూర్తి బాసటగా నిలుస్తోంది. ఈ బాధ్యతల నిర్వహణలో ఎంతకైనా తెగిస్తాం. ఇందుకు మేం సిద్ధమై ఉన్నాం” అని పాక్ సైన్యాధిపతి తెలిపారు. భారత తాజా చర్యలను తిరస్కరించాలని పాక్ ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగంలోని 370, 35ఎ అధికరణాలను పాక్ ఎన్నడూ గుర్తించలేదన్నారు. కశ్మీర్ లోయలోని ‘తమ పౌరుల’ భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు పాక్ సైనిక అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ వ్యాఖ్యానించారు. వారిని రక్షించుకోవడానికి అన్ని చర్యలనూ తీసుకుంటామన్నారు.
చైనా కూడా కశ్మీర్లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై చైనా ఆందోళన చెందుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారానే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలను కోరుతున్నామన్నారు. లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న నిర్ణయంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మరో ప్రకటనలో స్పందించారు. ”చైనా భూభాగాన్ని భారత్ తమ పరిపాలనా పరిధిలోకి కలుపుకోడాన్ని చైనా ఎప్పుడూ వ్యతిరేకిస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం ఏకపక్షంగా తమ దేశ చట్టాలను సవరించి చైనా భౌగోళిక సార్వభౌమత్వాన్ని నిర్లక్ష్యం చేయడం మాకు ఆమోదయోగ్యం కాదు” అని తెలిపారు. దీనిపై భారత్ స్పందిస్తూ ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని ఘాటుగా జవాబిచ్చింది.
నేను ఎప్పుడూ వేధింపులు ఎదుర్కోలేదు : అనుష్క