2019-20 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠం విద్యావిధానం ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటనలో తెలిపారు. గతంలో పాఠశాల మానేసినవారు, ఎలాంటి విద్యార్హతలు లేని వారు కూడా తమ జనన ధ్రువీకరణ పత్రంతో నేరుగా ఓపెన్ స్కూలింగ్ 10వ తరగతిలో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్లోనూ అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఇందుకు గాను శుక్రవారం నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
10వ తరగతి, ఇంటర్మీడియట్లలో ప్రవేశం పొందగోరే అభ్యర్థులు నిర్ణీత ఫీజుతో అక్టోబర్ 21వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని, అదే ఆలస్య రుసుముతో అయితే అక్టోబర్ 31వ తేదీ వరకు ఇందుకు గడువుందని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను https://www.telanganaopenschool.org వెబ్సైట్లో పూర్తి చేసి ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఆర్డినేటర్ ఎల్.శంకర్ను 9951356569లో సంప్రదించవచ్చని అన్నారు.