telugu navyamedia
విద్యా వార్తలు

ఈరోజున్న పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులు వినా మరో మార్గం లేదు.

E learning Online

ఈరోజున్న పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులు వినా మరో మార్గం లేదు. బడులు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఫలానా అప్పుడు తెరవచ్చు అని ఎవరూ చెప్పే పరిస్థితీ లేదు. తెరిచినా పేరెంట్స్ పంపుతారో పంపరో తెలియదు. ఓ పక్క కొన్నినెలల నుంచి రోజులు వృథా అయిపోతున్నాయి. మా పిల్లలు పనీపొంగేం లేకుండా ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లతో కాలక్షేపం చేస్తున్నారు అనేక నెలలుగా అని ఎందరో పేరెంట్స్ మొరపెట్టుకుంటున్నారు. ఇదివరకూ బడులు ఉన్నప్పుడు కనీసం స్నానాలు అయినా చేసేవారు. ఇప్పుడు లేవటం లేటు. లేచాకా కరోనా భయంతో బయటకు వెళ్లట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. దాంతో ఒక్కొక్కరూ కిలోలకు కిలోలు వెయిట్ పెరిగారు. హాల్లోనే తినటం, పడుకోవటం, టీవీ చూడటం. ఎప్పుడో సాయంత్రం స్నానం చేస్తుంటే పెరగరా మరి? విద్యార్థి జీవితంలో కీలక దశలో అనేక రోజులు వృథాగా పోయాయని పేరెంట్స్ ఎంత ఆందోళనతో ఉన్నారు.

కారు చీకట్లో కాంతిరేఖలా ఆన్‌లైన్ క్లాసులు తెరిచారు. రోజులో ఎంతోకొంత సేపైనా పిల్లలు కనీసం ఎంగేజ్ అవుతున్నారు. పక్కన నోట్స్ పెట్టుకుని రాసుకుంటున్నారు. బడిలో పుస్తకాలు కొని క్లాసు ఫాలో అవుతున్నారు. అందులో చిన్నచిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కాదనట్లేదు. అందరికీ ఐప్యాడ్, యాపిల్ కంప్యూటర్ కొనాలని ఎవరూ చెప్పట్లేదు. స్మార్ట్ ఫోన్ లేని ఇళ్లు లేవు. జీయో సిమ్ కార్డు లేని ఫోన్ లేదు. అది చాలు ఆన్‌లైన్ ‌క్లాస్ అటెండ్ అవటానికి.

ఆన్‌లైన్ క్లాసుల వల్ల అనారోగ్య సమస్యలు అని ఒకరు అంటారు. సపోజ్ ఆన్‌లైన్ క్లాసు లేకపోతే పిల్లలేమైనా బాబా రాందేవ్‌లాగా యోగాసనాలు వేయట్లేదు కదా! అదే ఫోన్ పట్టుకుని టైం వేస్ట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులకు ఫీజులు కట్టించుకోవటం నేరమా? లాక్‌డౌన్ వలన చాలా నెలల నుంచి బడుల్లో పనిచేసే సిబ్బందికి కూర్చోపెట్టి జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. కొంత తగ్గించి అయినా కానీ. అలాగే 80 శాతం బడులు అద్దె భవనాల్లో నడుస్తాయి. ఫీజులు రాకపోయినా వాటికి అద్దెలు కట్టాల్సి వస్తోంది. శానిటైజేషన్ పేరుతో బోలెడంత ఖర్చు పెట్టాల్సి వస్తోంది. సరే ఇంక విద్యార్థి సంఘాలు, పేరు చెప్పకూడని సంఘాల చందాల దందాలు, ఫీజుల్లో కన్సెషన్లు లాంటివి సరేసరి. మరి బడి ఎలా నడపాలి? ఫీజులు కట్టకపోతే పుస్తకాలు రోడ్డునపాడేస్తే, ఎండలో నిలబెట్టిన యాజమాన్యాలను కడిగిపారేయటంలో తప్పులేదు. కానీ ఫీజు వసూలు చేయటమే తప్పు అయితే మరి బడి నడిపేదెలా? పిల్లల ఎకడమిక్ ఇయర్ అలాగే గాలికి వదిలేయాలా? పాఠశాల మీద పెట్టుబడి పెట్టిన యజమాని సొంత బిల్డింగులు అయితే వాణిజ్య సముదాయాలకు అద్దెకు ఇచ్చుకుంటాడు. లేకపోతే వేరే బిజినెస్ చూసుకుంటాడు. మరి పిల్లల ఫ్యూచరేంటి? అవి మూసేస్తే, ఆర్థిక ఇబ్బందులతో మూతబడితే ప్రభుత్వ బడులకు పంపుతామా? As a parent గా మీరు చెప్పండి? ప్రైవేటు, కార్పోరేట్ బడులన్నీ మూసేద్దాం? మీరు మీ పిల్లల్ని సర్కారు బడికి పంపటానికి సిద్ధమా? పోనీ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ఏవైనా దూరదర్శన్ లాంటి ఛానెళ్లో ఆన్‌లైన్ పాఠాలు ఉచితంగా చెబుతున్నాయా అంటే అదీ లేదు.

ప్రైవేటు లేదా కార్పోరేటు ఆస్పత్రులు కావచ్చు, విద్యాసంస్థలు కావచ్చు ఎంతమందికి జీవితాలు ఇచ్చాయో గుర్తు తెచ్చుకోవాలి. క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కోసం ఎఫర్డ్ చేయగలిగిన వారే వస్తున్నారు. ఆన్‌లైన్ క్లాస్ పెట్టాలి అంటే ఫీజు కట్టాలి. అందులో తప్పేముంది. అసలు ఎంతమంది పే చేస్తారు? ఎంతమంది ఆయా తరగతుల్లో కొనసాగుతారో తెలిస్తే దానిని బట్టి అడ్మీషన్లు తీసుకుంటారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు అనే డైలాగ్‌కు అర్థం లేదు. కరోనా వాళ్ల చిన్న జీతగాళ్లు చిన్నగా నష్టపోతే పెద్ద వ్యాపారులు పెద్దగా నష్టపోయారు? కరోనా ఎఫెక్టు పాఠశాల యజమానుల మీద మామూలుగా లేదు. వారి మనోభావాలు ఎవరికీ అక్కర్లేదా? కనీసం వారి పెయిన్ ఏంటో అడిగే ప్రయత్నం మీడియా ఎందుకు చేయదు? ఫీజులు తీసుకోవటం భయంకరమైన తప్పుగా చిత్రీకరిస్తున్న వారు తమ తమ వ్యాపారాల్లో ఏవైనా ధరలు అన్నీ తగ్గించి ఉచితంగా సేవలు అందిస్తున్నారా? ఆలోచించండి.

Related posts