దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగడంతో ఏపీ సర్కారు రైతు బజార్లలో ఉల్లిని రాయితీపై అందిస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఉల్లి కోసం విక్రయ కేంద్రాల్లో ప్రజలు తొక్కిసలాడుకుంటుండడాన్ని లోకేశ్ విమర్శించ సంగతి తెలిసిందే. తాజాగా ఉల్లి కొనుగోలు చేస్తున్న వారి వేలికి సిరా చుక్క వేస్తుండడాన్ని లోకేశ్ ఎత్తిచూపారు.
సిరా చుక్కకి, ఓటుకు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందేనని, కానీ కిలో ఉల్లి ఇచ్చేందుకు వేలికి సిరా చుక్క వేస్తున్నసీఎం జగన్ చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ఉల్లి కోసం వేస్తున్న సిరా చుక్కే జగన్ అసమర్థ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. రాజమండ్రిలో రైతుబజార్ వద్ద ఉల్లి కొనుగోలు సందర్భంగా మహిళల వేలికి సిరా చుక్కను వేస్తున్న వీడియోను కూడా లోకేశ్ ట్వీట్ చేశారు.