ఉల్లి ధరలను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ప్రభుత్వాలే నేరుగా చవక ధరకు వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.15కే విక్రయించనుంది. ఇందుకోసం కడప జిల్లా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఉల్లిపాయలను కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు ఉండగా 101 బజార్ల ద్వారా సామాన్యులకు విక్రయించనుంది.
కడప రైతుల నుంచి కిలో ఉల్లిని రూ.50 చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వం.. రూ.15కే సామాన్యులకు విక్రయించనుంది. రోజుకు 50 టన్నుల ఉల్లిని తెప్పించనున్నట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. ఈజిప్ట్, టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లిపాయలు రాష్ట్రానికి చేరుకుంటే కిలోకు రూ.25 చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించింది.