ఒమన్ ఎయిర్వేస్కు చెందిన 204 ముంబై-మస్కట్ విమానం టేకాఫ్ అయిన పది నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన నిన్న జరిగింది. అయితే ఈ విమానంలోని ఒక ఇంజన్ ఫెయిల్ అయ్యిందని తెలుస్తోంది. సింగిల్ ఇంజిన్ తో విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 206 మంది ప్రయాణికులున్న ఒమన్ విమానం టేకాఫ్ అయిన పదినిమిషాలకే ఒక ఇంజన్ పనిచేయడం లేదని తెలుసుకున్న పైలెట్ వెంటనే అత్యవసరంగా ముంబై విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. ఒమన్ విమానంలో ఫెయిలైన ఇంజన్ ను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు.