కోటి రూపాయలతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు వృద్ధ దంపతులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్కు చెందిన వృద్ధ దంపతులు మేరెడ్డి సత్యనారాయణరెడ్డి-జానకమ్మ. చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో ‘వానప్రస్థానం’ పేరుతో మార్చి 3, 2017న వారు వృద్ధాశ్రమాన్ని ఎకరంన్నర భూమిలో నిర్మించారు. దాదాపు రెండేళ్లుగా ఎంతో మంది వృద్ధులకు ఆశ్రమంలో చోటు కల్పించారు.
వయసు మీదపడటంతో పాటు అనారోగ్య కారణాల వల్ల వృద్ధ దంపతులకు ఆశ్రమం నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసిన ఆశ్రమం నిరుపయోగంగా ఉండకూడదని భావించి ప్రభుత్వానికి విరాళంగా అప్పగించారు.
వృద్ధాప్య సమస్యల వల్ల ఆశ్రమాన్ని కొనసాగించలేమని, ప్రభుత్వమే ఆశ్రమ బాధ్యతలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వృద్ధ దంపతులు గురువారం కలిశారు. ఎకరన్నర భూమిలో 6 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా అందిస్తామని ప్రకటించారు.
అందులో సేవలు కొనసాగేలా చూడాలని కేటీఆర్ను కోరారు. వృద్ధ దంపతుల సేవా దృక్పథాన్ని కేటీఆర్ కొనియాడారు. ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు కొనసాగేలా ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన కలెక్టర్ అనితారామచంద్రన్తోన మాట్లాడారు.