నగరంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘షీ’ టీంలు ఏర్పటు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి దృష్టికి వచ్చిన విషయాలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పోకిరీ వేషాలంటే వెంటనే యువత గుర్తుకువస్తారు.. కానీ పోకిరీ వేషాలకు పాల్పడుతు దొరుకుతున్న వారిలో 50 ఏళ్ల పైబడ్డవారూ, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మైనర్లూ ఉండటం గమనార్హం. ఈవ్టీజింగ్కు సంబంధించి పట్టుబడుతున్న వారిలో మూడొంతులు 19 నుంచి 35 ఏళ్ల వయసు మధ్య వారు ఉంటున్నారు. బస్టాపులు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయాలు చివరకు రైతు బజార్ల వంటి చోట్ల సైతం యువతులు కనిపిస్తే చాలు పోకిరీలు సిద్ధమవుతుంటారు.
సూటిపోటీ మాటలతో వేదిస్తుంటారు. అసభ్యకర సైగలతో ఇబ్బందులు పెడుతుంటారు. ఇలాంటి వారి ఆటకట్టించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘షీ’ టీంలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఇదే తరహాలో ‘షీ’టీంలు ఏర్పాటు చేసుకున్నాయి. తమకు పట్టుబడుతున్న పోకీరీలపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. వారిలో చిన్నవయసు వారైతే కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. ఈవ్టీజింగ్కు పాల్పడుతూ ఒకటికంటే ఎక్కువసార్లు దొరికితే కఠినంగా వ్యవహరిస్తున్నారు.
పట్టుబడుతున్న వారిలో ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారన్న విషయం పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అధికారులు చేసిన ఈ విశ్లేషణలో ఈవ్టీజింగ్కు పాల్పడి దొరుకుతున్న వంద మందిలో అత్యధికంగా 37.8శాతం మంది 19 నుంచి 24 వయసు వారే ఉంటున్నారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారు 36.4శాతం మంది దొరుకుతున్నారు. అంటే పట్టుబడుతున్న వందమందిలో 19-35 ఏళ్ల మధ్య వయసు వారి శాతం 74.2. ఈ లెక్కన ఈవ్టీజింగ్లో దొరుకుతున్న వారిలో మూడొంతుల మంది వీరే అన్నమాట. విచిత్రంగా 50 ఏళ్ల పైబడ్డ వారు ప్రతి వంత మందిలో ఇద్దరు చొప్పున ఉంటున్నారు.