డ్రోన్ దాడితో చమురు ధరలు బ్యారెల్కు ఐదు నుంచి పది డాలర్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు ఉదయానికి దాదాపు ఆరు డాలర్లు పెరిగింది. మరోవైపు త్వరలో చమురు ధరలు 100డాలర్లు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మన దేశపు చమురు అవసరాల్లో 80శాతం, సహజవాయువుల్లో 10శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకొంటున్నాం. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ధరలు పెరగడం మూలంగా భారత దిగుమతుల ఖర్చుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆరామ్కో దాడి పరిణామాలను భారత్ దగ్గరగా గమనిస్తోంది. ఓవైపు ఆర్థిక మందగమనం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో ఇప్పటికే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ తాజా చమురు అంశం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అరామ్కోకు చెందిన చమురు ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్ దాడి జరిగిన నేపథ్యంలో చమురు ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆరామ్కోకు చెందిన రెండు చమురు ఉత్పత్తి కేంద్రాలపై ఇరాన్కు చెంది హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ ద్వారా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అంటే అంతర్జాతీయ చమురు ఉత్పత్తుల్లో 6శాతం మేర నిలిచిపోయింది. వీలైనంత త్వరగా ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని సీఈవో ప్రకటించారు.