telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉల్లిపై లొల్లి..పెరిగిపోతున్న ఆఫర్లు…టికెట్ కొంటె ఉల్లి ఫ్రీ అంట…

offers on onions increasing

దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ఉత్పత్తి దారులకు ఆనందంగా ఉన్నప్పటికీ, కొనేవాళ్లకు చుక్కలు కనపడుతున్నాయి. కొన్ని చోట్ల బంగారం అయిపోయిన ఉల్లిని దొంగతనం కూడా చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా ఉల్లి పంటనే దోచుకెళ్తున్నారు. ఇక సామజిక మాధ్యమాలలో ఈ లొల్లిపై ఫన్నీ వీడియోలు ఎన్నో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయన్న విషయం తెలిసిందే. దీనితో ఇదే సందు అనుకోని పలువురు ఇతర వ్యాపారస్తులు తమ వస్తుసేవలను అమ్ముకోడానికి ఉల్లి-లొల్లిని వాడేసుకుంటున్నారు. ఆన్ లైన్ బస్ బుకింగ్ సంస్థ అబిబస్ ఒక వినూత్న ఆఫర్ ను ప్రకటించింది. అబిబస్ వెబ్ సైట్ ద్వారా గోవా ట్రిప్ బుక్ చేసుకున్న వారికి 3 కేజీల ఉల్లి ఉచితంగా ఇవ్వనున్నట్లు అబిబస్ ప్రకటన చేసింది. డీల్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఈ ఆఫర్ ను అబిబస్ సంస్థ పేర్కొంది. ఎక్కువగా పర్యాటక ప్రాంతాల్లో పర్యటించే పర్యాటక ప్రియులు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. అబిబస్ గోవా టూర్ కు ఎక్కువ డబ్బులు వెచ్చించినవారికి ఐ ఫోన్ లేదా ఈ – బైక్ గెలుచుకునే మరో ఆఫర్ కూడా ప్రకటించింది.

కానీ టికెట్లు బుక్ చేసుకుంటున్న వారు ఎక్కువగా 3 కిలోల ఉల్లి బహుమతిని ఎంచుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ గురించి అబిబస్ సంస్థ సీవోవో రోహిత్ శర్మ స్పందించారు. టికెట్లు బుక్ చేసుకున్న వారు గోవా పర్యటన కంటే ఉల్లిపాయలకే అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు ఆఫర్లు అందిస్తున్నామన్న సంతృప్తి తమకు కలిగిందని రోహిత్ శర్మ చెప్పారు. 3 కేజీల ఉల్లి ఆఫర్ నిర్ణయం సరైనదే అనే నమ్మకం వచ్చిందని చెప్పారు. ఈ ఆఫర్ ను ఎంచుకున్న వారిలో ప్రతిరోజు 20 మందిని విజేతలుగా ప్రకటిస్తామని విజేతల ఇంటికి 3 కిలోల ఉల్లిని డెలివరీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 10వ తేదీన అబిబస్ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఆఫర్ కోసం అబిబస్ వెబ్ సైట్ ద్వారా గోవా టూర్ ను బుక్ చేసుకొని విజేతలుగా నిలవచ్చు. ఈ అఫర్ ప్రకటనతో పర్యాటక ప్రదేశాల బుకింగ్ లో వెనుకంజలో ఉండే గోవా రెండవ స్థానంలో నిలిచిందని తెలుస్తోంది.

Related posts