ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు.సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. సోమవారం ఆమె ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం విదితమే. దీనికి కీలక ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు బాధ్యుల్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు.
యూట్యూబ్లో దాదాపు 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్ చానల్స్కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు. ఆయా చానల్స్లో ఉండే వివరాల ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. శుక్రవారం నాటికి మొత్తం 15 మందిని గుర్తించారు. వీరిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం వీరిని నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు.