హైదరాబాద్ నగరంలో రేపు గణేశ్ నిమజ్జన వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ వివరించారు. ఇందుకోసం రోడ్ మ్యాప్ను రూ పొందించినట్లు తెలిపారు. ఈ నెల 12న నిమజ్జనం సందర్భం గా పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లను ఏర్పాటు చేశామని, ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. గణేశ్ విగ్రహాలను ఫ్లైఓవర్ల మీదుగా తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఫతేనగర్, సైబర్ టవర్స్, ఫోరం మాల్, గచ్చిబౌలి ఫ్లైఓవర్లపైకి గణేశ్ విగ్రహాలను అనుమతించమని చెప్పారు.
బీహెచ్ఈఎల్ ఎక్స్రోడ్డు, గోద్రేజ్ వై జంక్షన్, కూకట్పల్లి, బాలానగర్-ఫతేనగర్ బ్రిడ్జి, గోద్రేజ్-ఎర్రగడ్డ, ఫిరోజిగూడ-గోద్రేజ్ వై జంక్షన్, కూకట్పల్లి, గుడేన్మెట్-నర్సాపూర్ ఎక్స్రోడ్, పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్-ఆరాంఘర్ ఎక్స్రోడ్డు వైపు భారీ వాహనాలు వెళ్లేందుకు అనుమతించరు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నగరంలోకి వెళ్లవచ్చని తెలిపారు. బోయిన్పల్లి, సికింద్రాబాద్ చుట్టుపక్కల కాలనీల నుంచి గణేశ్ విగ్రహాలతో వచ్చే వాహనాలు అంజయ్యనగర్ గుండా చెరువు వద్దకు చేరుకొని నిమజ్జనం అనంతరం ఖాళీ వాహనాలు ఓల్డ్ బోయినపల్లి, మాస్క్యూ రోడ్, హరిజన బస్తీ గుండా బయటకు వెళ్లాల్సి ఉంటుందని వెల్లడించారు.