నోకియా సంస్థ స్మార్ట్ టీవీ లను మార్కెట్లో కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొన్నటిదాకా స్మార్ట్ ఫోన్ లను ఉత్పత్తి చేసిన ఈ సంస్థ తాజాగా టీవీల ఉత్పత్తిపై కూడా ద్రుష్టి సారించింది. త్వరలోనే స్మార్ట్టీవీలను లాంచ్ చేయనుంది. ఇందులోభాగంగా ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతదేశంలో నోకియా స్మార్ట్ టీవీలను లాంచ్ చేయడానికి ఫ్లిప్కార్ట్ బుధవారం నోకియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుందని ఫ్లిప్కార్ట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ వినియోగదారుల అవసరార్థం దేశీయంగా నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీల అభివృద్ధి, పంపిణీని సులభతరం చేయడానికి, ఎండ్-టు-ఎండ్, గో-టు-మార్కెట్ వ్యూహాన్ని నిర్వహించేందుకు ఫ్లిప్కార్ట్ పనిచేయనుందని తెలిపింది.
నోకియా-ఫ్లిప్ కార్ట్ బ్రాండ్తో భాగస్వామ్యం ద్వారా ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికామని చెప్పింది. తద్వారా కొన్ని వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అత్యాధునిక సౌండ్ నాణ్యత కోసం ఇందులో జేబీఎల్ సౌండ్ సిస్టంని ఉపయోగించనున్నారు. దీంతో భారతదేశ టీవీ రంగంలో జేబీఎల్ కూడా మొదటిసారి అడుగు పెడుతున్నట్లు అవుతుంది. వినియోగదారులకు సౌండ్ సిస్టమ్నుఅందించేందుకు జేబీఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ బ్రాండ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్- ఆదర్ష్ మీనన్ తెలిపారు. ఈ టీవీలను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువచ్చేదీ, ధర, ఫీచర్లు సంబంధిత వివరాలను మాత్రం వెల్లడించలేదు.