కేంద్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తమ పరిధిలోని జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ (ఎన్ఐఓఎస్) ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. మే 20 నుంచి 31 వరకు ప్రత్యేక ఆన్ డిమాండ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 30 రోజుల్లో ఫలితాలను ప్రకటిస్తారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎన్ఐఓఎస్ ప్రాంతీయ సంచాలకుడు అనీల్కుమార్ తెలిపారు. ఎన్ఐఓఎస్లో ఐదు పరీక్షలు ఉంటాయి. అయితే ఇంటర్లో పాసైన రెండు సబ్జెక్టులను బదిలీ చేసుకోవచ్చు. కాబట్టి మూడు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇంటర్లో చదివిన సబ్జెక్టులనే కాకుండా తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చని ఎన్ఐఓఎస్ అధికారులు తెలిపారు.
ఎన్ఐఓఎస్ ధ్రువపత్రంతో ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఇంటర్ అర్హతలతో కూడిన ఉన్నత చదువులకు వెళ్లవచ్చు. ధ్రువపత్రంపై సప్లమెంటరీ కానీ, నక్షత్రం గుర్తు కానీ ఉండదని అనిల్కుమార్ పేర్కొన్నారు. అనేక సబ్జెక్టుల్లో పదే పదే ఫెలయిన విద్యార్థులు ఎన్ఐఓఎస్ విధానం ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.