ఒక్క బీజేపీకే తిరుగులేని మెజారిటీ వచ్చినా కూడా ఎన్డీయే లో ఇతర పార్టీలు అలకలు మాత్రం ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. తాజాగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చేరబోమని జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం ఎన్డీయేలో కొనసాగుతామని ఆయన తేల్చిచెప్పారు. ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి ఇవ్వజూపడంపై నితీశ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రతిపాదన ఆమోదయోగ్యంగా లేదని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
బీహార్లో జేడీయూ 16 ఎంపీ సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి భవన్లో మరికాసేపట్లో నరేంద్ర మోదీ ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి బిమ్ స్టెక్ దేశాధినేతలు, బీజేపీ అగ్ర నాయకుడు ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖేష్ అంబానీ దంపతులు, సినీ నటుడు రజనీకాంత్తో పాటు పలువురు ప్రముఖులు వచ్చారు.