ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ఈ నెల 15న ఢిల్లీలో జరుగనున్నది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక, హోం, రక్షణ, వ్యవసాయ, వాణి జ్య, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ వైస్చైర్మన్, సీఈవో, సభ్యులు హాజరవుతారు. నీతి ఆయోగ్ ఏర్పాటైనప్పటి నుంచి ఇది ఐదో సమావేశం. దేశంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో శాంతిభద్రతలు తదితర అంశాలను ఎజెండాగా నిర్ణయించారు.
రాష్ట్రాల ప్రణాళికలకు మద్దతు తెలిపేందుకు ఆర్థిక పరమైన అధికారాలు లేనందున నీతి ఆయోగ్వల్ల నిష్ప్రయోజనమని, ఈ సమావేశానికి తాను హాజరు కావడం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకు జరిగిన సంస్థ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపై ఈ సమావేశంలో సమీక్షిస్తారని ఒక అధికారిక ప్రకటన వెలువడింది.