రాహుల్ గాంధీపై దేశ ప్రజలకు నమ్మకం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ గెలుస్తుందంటే, ఎవరికీ విశ్వాసం కలగడం లేదని తెలిపారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని నెహ్రూ హయాం నుంచి చెబుతున్నఇప్పటివరకూ కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయిందన్నారు. తాజాగా ‘న్యాయ్’ అంటూ మరో పథకాన్ని తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల పాటూ ప్రజలు చూసిన పాలన కేవలం ట్రయిలర్ మాత్రమేనని అన్నారు.
అసలు చిత్రం భవిష్యత్తులో కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందించనుందని అన్నారు. కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు పాలించినా, దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇకపై వారు విపక్షానికే పరిమితమని ఆయన అన్నారు. బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. గడచిన 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులను కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.