‘భీష్మ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నితిన్, రష్మిక, వెంకీ కుడుముల, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దిల్ రాజు, సంపత్ రాజ్, శుభలేఖ సుధాకర్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, గేయ రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ చిత్ర విజయం ఏ ఒక్కరిదో కాదని చిత్ర యూనిట్ మొత్తం కష్టం అని చెప్పుకొచ్చారు. ‘దిల్’ సినిమా దగ్గర నుంచి నితిన్కు తాను చాలా పెద్ద ఫ్యాన్ అని వెంకీ చెప్పారు. ‘‘18 ఏళ్ల వయసప్పుడు ఆయన కొడితేనే అందరూ నమ్మారు.. అలాంటిది కమర్షియల్ సినిమాలు చేయట్లేదేంటి అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను సినీ పరిశ్రమలోకి వచ్చానో నితిన్తో ఒక కమర్షియల్ సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఒక ఫ్యాన్గా ఆయన్ని అలాగే చూపించానని అనుకుంటున్నాను. ఇన్నిరోజులూ ఆయన సినిమాలకు ఫ్యాన్ని. ఆయనతో వ్యక్తిగతంగా పనిచేసినప్పుడు ఆయన క్యారెక్టర్కి, యాటిట్యూడ్కి ఫ్యాన్ అయిపోయాను’’ అని వెంకీ చెప్పుకొచ్చారు.
వెంకీ కుడుముల మాట్లాడటం పూర్తయిన తరవాత ఆయన దగ్గరికి వచ్చిన నితిన్.. ‘‘ఈ స్క్రిప్ట్ నీదేనా? ఈ కథ నువ్వే రాశావా?’’ అని అనగానే అక్కడంతా నవ్వులు పువ్వులు పూశాయి. అయితే, నితిన్ ఈ మాట అనడానికి పెద్ద కారణమే ఉంది. ఇది డైరెక్ట్గా హీరో నాగశౌర్యకు వేసిన పంచ్. నాగశౌర్య, వెంకీ కుడుముల కాంబినేషన్లో ‘ఛలో’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారానే వెంకీ దర్శకుడిగా పరిచయమ్యారు. అయితే, ఈ సినిమానే నాగశౌర్య, వెంకీ మధ్య దూరం పెంచింది.‘ఛలో’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్లో నిర్మించిన ఈ చిత్రంతో వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేశారు. అయితే, ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరవాత కథ తనదని, కాకపోతే టైటిల్స్లో తన పేరు వేసుకోలేదని నాగశౌర్య అన్నారు. బహుశా, ఈ వ్యాఖ్యలే నాగశౌర్య, వెంకీ కుడుముల మధ్య దూరం పెంచి ఉండొచ్చు. వెంకీ హర్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ తరవాత వీరిద్దరూ మాట్లాడుకున్నది లేదు, కలుసుకున్నదీ లేదు.
నాగశౌర్య, వెంకీ కుడుముల మధ్య మాటల్లేవనే విషయం ‘అశ్వథ్థామ’ సినిమా సమయంలో తెలిసింది. నాగశౌర్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. ‘ఛలో’ సినిమాతో వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేస్తే తనను కాదని వెళ్లిపోయాడని ఆరోపణ చేశారు. అంతేకాకుండా, తన తల్లి కొనిచ్చిన కారును అమ్మేశాడని ఆరోపించారు. ఇప్పుడు తన ముందు నిలబడే ధైర్యం వెంకీ చేయడని ఘాటుగానే అన్నారు. మొత్తంగా వెంకీ కుడుములదే తప్పన్నట్టుగా నాగశౌర్య చెప్పుకొచ్చారు.నాగశౌర్య వ్యాఖ్యలపై స్పందించడానికి వెంకీ కుడుముల ఆసక్తి చూపించలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన తీసుకురాగా.. వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. అసలు ఈ వివాదాన్ని పెద్దది చేయదలుచుకోవడం లేదని స్పష్టం చేశారు. కాకపోతే, నాగశౌర్య తల్లి గిఫ్ట్గా ఇచ్చిన కారు తన వద్దే ఉందని, బహుమతిగా ఇచ్చిన కారును ఎవరైనా అమ్ముకుంటారా? అని సమాధానం చెప్పారు.‘భీష్మ’ సక్సెస్ మీట్లో నితిన్ వేసిన పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది కచ్చితంగా నాగశౌర్యకు వేసిన పంచేనని అంటున్నారు.
రేప్ లకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం… బిగ్ బాస్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు