దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ కేసులో దోషులను త్వరలోనే ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ షూటర్ వర్తిక సింగ్ స్పందించారు. దోషులను మహిళే ఉరితీయాలని వర్తిక సింగ్ అన్నారు. ఈ మేరకు ఆమె డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు రక్తంతో కూడిన లేఖను స్వయంగా రాశారు.
నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న నలుగురి ఉరిశిక్షను మహిళచేతనే అమలు జరిపించాల్సిందిగా ఆమె పేర్కొన్నారు. లేదంటే ఉరితీతకు తలారీగా తనను నియమించాలని ఆమె ఆ లేఖలో కోరారు. దీని ద్వారా ఇటువంటి శిక్షలు మహిళ కూడా వేయగలదన్న సందేశాన్ని కూడా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆమె ఈ లేఖను మీడియా ముందుకు తీసుకొచ్చారు.