సొంత దేశానికి నామాలు పెట్టి, బ్రిటన్ లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసేసుకున్నాడు. మనదేశం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. బ్రిటన్ లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోడానికి వీసా పొందిన తరువాత మనదేశ చట్టం ఇంక ఏమి చేయలేకపోవచ్చు. రూ. 13 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే. తాజాగా, నీరవ్ మోదీకి బ్రిటన్ ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేసిన ఘటన వెలుగు చూసింది.
ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు యూకే ప్రభుత్వ కంపెనీల్లో బాండ్లు, షేర్లలో 2 మిలియన్ పౌండ్లను పెట్టుబడిగా పెడితే వారికి అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో నీరవ్ కు బ్రిటన్ ప్రభుత్వం భారత్ పాస్ పోర్టుపై గోల్డెన్ వీసాను జారీ చేసింది. ఈ వీసా పొందిన వారు అక్కడ పని చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు. శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.
లండన్ నగరంలోని వెస్ట్ ఎండ్ లో నీరవ్ మోదీ 8 మిలియన్ యూరోల విలువ కలిగిన ఫ్లాట్ లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అక్కడ వజ్రాల వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. అతనిపై యూకే అధికారులు ఇంతవరకు చట్టపరమైన చర్యలను ప్రారంభించలేదు.