ప్రధానికి ఏపీ సీఎం లేఖ రాయడంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే కరెంట్ ఉత్పత్తి కోసమని అటువంటిది శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చూడడం అర్థరహితమని అన్నారు. సమైక్య పాలనలో కృష్ణానది నీళ్లను ఆంధ్రా పాలకులు ఇష్టమొచ్చినట్లు దోచుకున్నరన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉందన్నారు. ఒక నది బేసిన్లో ఉన్న ప్రాంత నీటి అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు తరలించాలని నిపుణులు చెప్పారు. అయినా ఏపీ పాలకులు శ్రీశైలం అట్టడుగు నుండి రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కడుతున్నారు. జాతీయ పార్టీలది అవకాశవాద వైఖరి, ప్రజల సమస్యలు వాళ్లకు పట్టవన్నారు.తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అనేక కేసులు వేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏపీలో ఒక్క కేసు అయినా వేశారా అని మంత్రి ప్రశ్నించారు. అత్యధిక కేటాయింపులు తెలంగాణ వాడుకోవాలని ఉమ్మడి ఆంధ్రాలో బచావత్ ట్రిబ్యునల్ చెప్పిందని గుర్తు చేశారు. అన్ని అనుమతులు వచ్చాకే కొత్త ప్రాజెక్టులు కట్టాలనే విషయాన్ని పట్టించుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతున్నారని మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. మీలాగా తెలంగాణ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టడం లేదు. కాళేశ్వరం అన్ని అనుమతులు తీసుకొని కట్టిందని చెప్పారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. రెండు మూడు నెలలు సమయం తీసుకొని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాలి. బీజేపీలో రెండు రాష్ట్రాల్లో రెండు రకాలుగా మాట్లాడుతుంది. ఈ విషయంలో బీజేపీ వైఖరి చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
previous post