జపాన్లోని మెయ్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని చేసిన పని నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వర్సిటీలో పనిచేసే ఓ ప్రొఫెసర్ జపాన్ సంస్కృతి గురించి ఓ వ్యాసం రాయాలని విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చారు. ఈ పని పూర్తి చేస్తే దానికి పరీక్షలో మార్కులుంటాయని చెప్పారు. దీంతో విద్యార్థులంతా తమ దేశ సంస్కృతిలో తమకు నచ్చిన అంశంపై వ్యాసాలు రాయడం మొదలెట్టారు. వీరిలో ఎమీ హాగా అనే అమ్మాయి ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. అందుకోసం జపాన్ సంస్కృతితో విడదీయలేని బంధం కలిగిన ‘నింజా’ల గురించి వ్యాసం రాయాలని నిర్ణయించుకుంది. అదీ అందరిలా రాస్తే స్పెషల్ ఏముంది? అని, కొంచెం కొత్తగా ప్రయత్నం చేసింది. ఆ మరుసటి రోజు అందరితోపాటు ప్రొఫెసర్కు ఓ తెల్లకాగితం ఇచ్చింది. అది చూసి షాకైన ఆయన.. ఏంటిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు తన ట్రిక్ను వివరించింది ఎమీ. అదేంటంటే నింజాలు రాసే లేఖలు అందరూ చదవలేరు. అవి మామూలు కంటికి కనబడవు. కాగితాన్ని కొంచెం వేడిచేస్తేనే దానిపై అక్షరాలు కనబడతాయి. వేడి తగ్గిపోగానే మళ్లీ మాయమైపోతాయి. తాను కూడా అదే పద్ధతిలో నింజాల గురించి వ్యాసం రాశానని, దానికోసం తానే స్వయంగా ఇంకును తయారుచేసుకున్నానని ఎమీ చెప్పింది. ఆమె మాటలు నమ్మని ప్రొఫెసర్ కాగితాన్ని క్యాండిల్పై వేడి చేశాడు. దానిపై నిజంగానే అక్షరాలు కనిపించడంతో ఆశ్యర్యపోయాడు. ఆమె ప్రతిభకు ముగ్ధుడైపోయి ఫుల్ మార్కులిచ్చేశాడు.
previous post