రానున్ను లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ప్రధానిగా మరోసారి తానే బాధ్యతలను చేపట్టబోతున్నానని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లేహ్ లో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో జమ్ముకాశ్మీర్ పూర్తిగా నిరాదరణకు గురైందని తెలిపారు. ఈరోజు తాను శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకు.. రాబోయే రోజుల్లో వాటి ప్రారంభోత్సవాలను కూడా తానే చేస్తానని మోదీ చెప్పారు.
ఐదేళ్ల పాలనలో విభజన రాజకీయాలను పారదోలామని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఆలస్యం లేకుండా వేగంగా అందజేసే ప్రక్రియను చేపట్టామని చెప్పారు. మొదటి విడత సాయంగా ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ. 2 వేలు అందిస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నంబర్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేశామని మోదీ తెలిపారు.