ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఐపీఎల్ సమయంలో ఆటగాళ్లతో సెల్ఫీలు దిగేందుకు, వాళ్ల ఆటోగ్రాఫ్ల కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడతారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా భారత క్రికెట్ బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్కు పంపేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీ) వెనకడుగు వేసిందని తెలుస్తోంది. ఇప్పటికే భారత్లో 29 మందికి కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 90 వేల మంది ఈ వ్యాధి బారిన పడగా.. దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఐపీఎల్లో జిమ్మీ నిశమ్(కింగ్స్ పంజాబ్), లాకీ ఫెర్గుసన్(కేకేఆర్), మిషెల్ మెక్క్లాగాన్, ట్రెంట్ బోల్ట్(ముంబై ఇండియన్స్), కేన్ విలియమ్సన్(సన్రైజర్స్), మిషెల్ శాంట్నర్(చెన్నై సూపర్ కింగ్స్) ఆడాల్సి ఉంది. కానీ, వైరస్ను నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నాకే వీరిని కానీ, తమ మహిళ క్రికెటర్లను కానీ భారత్కు పంపుతామని ఎన్జెడ్సీ పీఆర్వో రిచర్డ్ బుక్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక వచ్చిన తర్వాతే.. న్యూజిలాండ్ ఆటగాళ్ల పర్యటన గురించి పునరాలోచిస్తామని ఆయన పేర్కొన్నారు.
previous post