మాస్ మహారాజా రవితేజ సినిమాలు వరుసగా ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్’, ‘అమర్ అక్బర్ ఆంటొని’, ‘డిస్కో రాజా’ డిజాస్టర్లు అయ్యాయి. ప్రస్తుతం రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘బలుపు’ వంటి హిట్ సినిమా రావడంతో.. ఇప్పుడు ‘క్రాక్’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే, రవితేజ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్లో కథా రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వక్కంతం వంశీ.. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ను చాలా రఫ్ చూపించి దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, వంశీ ఇప్పుడు రవితేజ కోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారట. గతంలో రవితేజ నటించిన కొన్ని సినిమాలకు వంశీ రైటర్గా పనిచేశారు. వంశీ వినిపించిన స్క్రిప్ట్ బాగా నచ్చడంతో.. ఆయనతో కలిసి పనిచేయడానికి రవితేజ అంగీకరించారు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు, ఇందులో హీరోయిన్ ఎవరు అనే వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
previous post