బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత రాలేదని, ఆయన ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. అప్పటి ప్రధాని వాజ్పేయితో తాను పనిచేశానని, ఆయనో సమర్థ ప్రధాని అని కొనియాడారు.
మళ్లీ మోడీ ప్రధాని అవుతారన్న నమ్మకం తనకైతే లేదన్నారు. వాజ్పేయితో మోదీని పోల్చలేమన్న నవీన్ పట్నాయక్.. మోదీ చెప్పింది ఏదీ చేయలేదని, యువతకు ఉపాధి కల్పనలోనూ ఆయన చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో ఒడిశాను ఆదుకునే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేడీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.